ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన పథకం కింద వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్ల స్థాపనకు పెట్టుబడిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో రెండు క్లస్టర్లు మంజూరు కాగా, ఒక క్లస్టర్ ఏలూరు జిల్లాలో నిర్మాణానికి సిద్ధమవుతోంది.
ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన పథకం ద్వారా వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లను స్థాపించాలనుకునే పెట్టుబడిదారులకు గ్రాంట్-ఇన్-ఎయిడ్/సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందుబాటులో ఉందని వెల్లడించారు.
గత ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లకు ఈ పథకం కింద ఆమోదం లభించిందని, వాటిలో ఒకటి ఏలూరు జిల్లాకు, మరొకటి విజయనగరం జిల్లాకు మంజూరు చేశామని కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం మొర్సపూడిలో 25.85 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే 'రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్' క్లస్టర్ కు ఇటీవలే శంకుస్థాపన కూడా జరిగినట్లు సమాచారం.
2017 నుంచి దేశవ్యాప్తంగా క్లస్టర్ విధానాన్ని అనుసరించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లలో మౌలిక సదుపాయాల కల్పన (APC) పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆమోదించబడిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ ను కోరారు.


