శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో అంతర్గత ఉచిత షటిల్ బస్సు సర్వీసులను ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ( - ఐలా) ఆధ్వర్యంలో ప్రారంభించారు. గురువారం ఉదయం జోనల్ మేనేజర్ విజయ భరత్ రెడ్డి ఈ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తిరుపతి జోనల్ మేనేజర్ విజయ భరత్ రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమలతో పాటు ఈ ప్రాంత నివాసితుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పనిదినాలలో ప్రతి 45 నిమిషాలకు పారిశ్రామికవాడలోని వివిధ ముఖ్య ప్రాంతాలను అనుసంధానిస్తూ బస్సులు రాకపోకలు సాగిస్తాయని ఆయన తెలిపారు. చెల్లుబాటు అయ్యే ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు చూపించి షటిల్ సేవలను వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మౌలిక వసతుల బలోపేతం
శ్రీసిటీలో సామాజిక మౌలిక వసతులను బలోపేతం చేయడంలో ఇదో మరో ముందడుగు అని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు.
పారిశ్రామికవాడలో పర్యావరణహిత, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందించడం ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, సందర్శకులు, పరిసర గ్రామాల ప్రజలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలిపారు. ఈ బస్సు సర్వీసులు ఉద్యోగులకు, విద్యార్థులకు, సందర్శకులకు, పరిసర గ్రామాల ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.












